గంగిగోవులాంటి ఒక సంస్కృత కళాశాలను కబేళాకు పంపడానికి రంగం సిద్ధమైంది. కేవలం కొద్ది రోజుల్లో కొన ఊపిరితో ఉన్న జీవచ్ఛవాన్ని ఎవరికీ కనిపించకుండా రుద్రభూమిలో అధికారికంగా కప్పెట్టనున్నారు. ఆ కళాశాల వివరాలు ఇవి…!
భారతదేశంలో దశాబ్దాల తరువాత హిందూ ధర్మ అభినివేశం ఉన్న భారతీయ జనతా పార్టీ సంపూర్తి అధికారంలో ఉంది. ఇటువంటి సమయంలో సర్వ భాషల జనని సంస్కృతానికి తీరని అన్యాయం జరగనుంది. గంగిగోవులాంటి సంస్కృత కళాశాలను కబేళాకు పంపడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే కళాశాల రక్తమాంసాల వంటి విద్యార్ధులను, ఉపాధ్యాయులను తీసివేసి అక్షరాలా జీవచ్ఛవాన్ని మాత్రమే ఉంచారు. మరి కొద్ది రోజుల్లో కొన ఊపిరితో ఉన్న జీవచ్ఛవం ఎవరికీ కనిపించకుండా రుద్రభూమిలో అధికారికంగా కలిసిపోనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కళాశాలను 1958లో స్థాపించారనడానికి సాక్ష్యం ఇదే
డాక్టర్ కొలచల వెంకట కృష్ణమూర్తి సంస్కృత కళాశాల గుంటూరు పట్టణంలో 1958లో స్థాపించారు. దీన్ని అప్పటి మేటి దాత కొలచల వెంకట కృష్ణమూర్తిగారు తమ సొంత ధనంతో ప్రారంభించారు. తరువాత ఈ కళాశాల యూనివర్సిటీ గ్రాంట్ల ద్వారా నడిచే ఎయిడెడ్ కళాశాలగా రూపుదిద్దుకుంది. దీనికి కృష్ణమూర్తిగారు తమ స్వార్జితంగా ఉన్న భవనాలు, భూములు విరాళంగా ఇచ్చారు. వీటి మార్కెట్ ధర నేడు వందల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నేడు ఉన్న అన్ని ఓరియంటల్ కళాశాలల్లో స్థిరాస్తుల విషయంలో అత్యంత ధనికమైన కళాశాల ఇదే. కళాశాల ప్రధాన భవనం 57 సంవత్సరాలది. దానికి కుడి ఎడమల ఉన్న భవనాలు సిమెంటుతో కట్టినవి. తగిన సంరక్షణ లేక కూలిపోవడానికి త్వరగానే సిద్ధమయ్యాయి.
గోడలపై ఊడలు వేస్తున్న మర్రి చెట్లు మరికొద్ది రోజుల్లో కళాశాలను ఆక్రమించనున్నాయి (చిత్రాన్ని క్లిక్ చేసి సవివరంగా చూడవచ్చు)
ఈ కళాశాల ఎందరో పండితులకు ఆవాసంగా ఉండి హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా అవిరళ కృషి చేసింది. ఇటువంటి సేవ చేసిన వారిలో ప్రాతః స్మరణీయులు మా తండ్రిగారైన స్వర్గీయ ఏలూరిపాటి అనంతరామయ్యగారు, స్వర్గీయ జమ్ములమడక మాధవరామ శర్మగారు, ఆచార్య బేతవోలు రాంబ్రహ్మంగారు వంటి వారు ఉన్నారు. ఒకానొక సందర్భంలో ఒక ప్రభుత్వ అధికారి కళాశాలల పరిశీలనకు వస్తున్నప్పుడు అప్పటి ప్రిన్సిపాల్ గారైన ఏలూరిపాటి వారు ఆ కళాశాలలో పనిచేసిన అధ్యాపక బృందం రచించిన పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. బల్లల మీద ఒక పుస్తకం తరువాత ఒక పుస్తకం పరుచుకుంటూ వెళితే సదరు అధికారికి కేవలం పుస్తకాల పేర్లు చదవడానికే గంటపైన పట్టిందట. మొత్తం పుస్తక ప్రదర్శన చూడడానికి తనకున్న సమయం సరిపోదని సరస్వతీ మందిరానికి నమస్కారం పెట్టి వెళ్లిపోయారట. అంతేకాదు, ఆ కళాశాలను తీసివేయడానికి వీలులేదని ప్రభుత్వానికి శిఫార్సుకూడా చేశారట. ఇది మూడు దశాబ్దాల క్రితం విషయం.
ఈ కళాశాలలో ప్రతీ ఏడాదీ గణపతి నవరాత్రులు జరిగేవి. వీటిలో అనేక మంది ప్రముఖ వక్తలు ప్రసంగించారు. అంతేకాక అనేక మంది ప్రముఖులు గుంటూరుకు వస్తే కళాశాలకు వచ్చి తమ అనుగ్రహ భాషణం చేసేవారు. అటువంటి వారిలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి పేరు తలవకుండా ఉండలేము. ఆటువంటి మహానుభావులు అడుగుపెట్టిన పవిత్ర వాఙ్మయ తపోభూమి ఇది.
ఇక్కడ సంస్కృత భాషలో, తెలుగు భాషలో పండితులు తయారు అయ్యేవారు. విద్యార్థులకు ఉచితంగా వసతి సౌకర్యం, భోజన సౌకర్యం ఉండేది. పుస్తకాలు కూడా ఉచితంగా ఇచ్చేవారు. ఇంజనీరింగ్, వైద్య విద్యల ప్రభంజనంలో రెపరెపలాడుతూ ఇన్నాళ్లూ వెలిగిన జ్ఞానజ్యోతి త్వరలో కొడిగట్టనుంది.
ఇంతటి ఘన చరిత్ర కలిగిన కళాశాల నిశ్శబ్దంగా కాలగర్భంలో కలిసిపోనుంది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయ పోస్టులలో మరొకరిని తీసుకోలేదు. ఫలితంగా ఇప్పుడు కేవలం ఒకే ఒక ఉపన్యాసకురాలు మిగిలారు. ఆమె కూడా సంస్కృత భాషకు చెందిన ఉపన్యాసకురాలు కాదు. ప్రస్తుతానికి ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆయన కూడా గత ఏడాదే పదవీ విరమణ చేయవలసి ఉండగా, తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు రెండు ఏళ్లు పెంచడంతో ఆయన మరికొన్ని నెలలో రిటైర్ కానున్నారు. ఈ దశలో ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు కూడా టీసీలు ఇచ్చి పంపించివేయడం జరిగింది. దీనితో ఈ కళాశాలను కబేళాకు పంపడానికి రంగం పూర్తి అయింది.
కళాశాలను నూతన భవనంలోకి మారుస్తున్నట్లు పెట్టిన నోటీసు. దీనితో ఇప్పటికే కళాశాల సగం వరకూ కాలగతిలో కలిసిపోయినట్లే
కళాశాల పై మక్కువ ఉన్నవారు అత్యవసరంగా ఒక్కసారి వెళ్లి చావుబతుకుల మధ్య ఉన్న కన్నతల్లి ని (వంటి కళాశాలని) కడసారి చూసుకున్నట్లు ఒకసారి చూసుకోండి. ఆలస్యం చేస్తే రేపు ఆమె అస్థికలు కూడా మిగలవు.
ఈ కళాశాలను నిలపడానికి కృషిచేసిన వారిలో గ్రంధి సుబ్బారావుగారు ప్రముఖులు. వీరు కళాశాల విద్యార్థులకు దశాబ్దాల తరబడి బియ్యాన్ని ఇస్తూ వచ్చారు. వీరితరువాత గుంటూరు జైన సంఘం వారు స్మరణీయులు. వీరు కందిపప్పు పంపేవారు.
సంస్కృత కళాశాలను, ఇతర కళాశాలలనూ ఒకే గాటన కట్టివేయడం మంచి పద్ధతి కాదు. లౌకిక విద్యను, ప్రాచీన భాషా విద్యను పోల్చిచూడడం కన్నతల్లి అందం అంచనావేయడం కన్నా నీచమైంది.
కొవ్వూరు గోదావరి తీరంలో ఉన్న ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠానికి చెందిన శ్రీ వాడ్రేవు జోగమ్మ వేద సంస్కృతకళాశాల నేడు కూడా విద్యార్థులతో కళకళలాడుతోంది. గుంటూరులోని కళాశాల మూతపడుతోంది. అంటే, లోపం కళాశాలలో లేదా సంస్కృత భాషలో లేదు. మరెక్కడో ఉంది!
కొవ్వూరుకు వెళ్లి నేటి తరం గురువులు బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు కళాశాల కోసం పాటుపడిన తీరు గమనిస్తే ఆ కళాశాల ఎలా నిలిచి ఉందో తెలుస్తుంది. ఈ కళాశాల నేడు ఒక వెబ్ సైట్ కూడా నిర్వహిస్తోంది. http://svjvsanskritcollege.com/
నేటికీ ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తపోనిధి బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకరశర్మగారు
ఒక సంస్కృత కళాశాల వెబ్ సైట్ కూడా నిర్వహించడం చూస్తుంటే, గుంటూరు కళాశాల ఏ లోపం వల్ల మూతపడుతోందీ అనే సందేహం కలుగుతోందని ఇటీవల కొందరు పుష్కరాల సమయంలో కొవ్వూరులో సందేహం వ్యక్తం చేశారు. నిజానికి కొవ్వూరు కళాశాల కన్నా గుంటూరు కళాశాల స్థిరాస్తులు కొన్ని వందల రెట్లు ఎక్కువ. కేవలం స్థలం విలువే వందల కోట్లలో ఉంటుంది.
రాష్ర్టవ్యాప్తంగా ఈ సంస్కృత కళాశాల నిర్వహణకు కోట్ల రూపాయల అవసరంలేదు. ప్రభుత్వం ప్రజాపంపిణీ గోదాముల్లో పందికొక్కుల నివారణకు ఖర్చుచేస్తున్న దానికన్నా చాలా తక్కువే అవుతుంది. కనీసం ఆపాటి సొమ్ముకూడా సర్వభాష జనని కోసం ఖర్చు చేయలేని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు?
తెలుగు, సంస్కృత భాష చదువుకునే వారు లేరు అనడం సిగ్గులేనితనం. నాకు తెలిసి కొందరు ఐ ఏ ఎస్, ఐపి ఎస్ అధికారులు కూడా మా నాన్నను సంస్కృతం చెప్పమని కోరడం జరిగింది. కొంత మంది సివిల్ అధికారులు ఛందోపూర్వక పద్యాలు రాయడం, చదవడం మా నాన్న దగ్గర నేర్చుకోవడం నాకు తెలుసు.
మా నాన్న నిర్వహించిన పద్యాల తోరణంలో ఎంతో మంది అధికారులు పాల్గొన్నారు. వీరంతా భాషాభిమానంతో తెలుగు పద్యవ్యాప్తిచేస్తున్నావారే.
సంస్కృత కళాశాలలు పోవడం వల్ల తెలుగు, సంస్కృతాలపై సాధికారత పోతుంది. రేపు భాషా విషయంలో ఏ సందేహం వచ్చినా విడమర్చి చెప్పగలిగే వారు ఉండరు.
యదా తదం అనాలా, యధా తధం అనాలా, యథాతథం అనాలో తెలియని తరాలు పుట్టుకొస్తున్నవేళ, నోరున్నవాడు రాసిందే భాషగా తయారవుతోంది.
అక్షరం శపిస్తుంది అని తెలియని వారు ఎక్కువవుతున్న వేళ ఒక సంస్కృత కళాశాల మూతపడితే ఏం? ఉంటే ఏం?
చూపియ్య, చేపియ్య మనే భాషలోని లోపాలు తెలియని వారు బయల్దేరుతుంటే రేపటి తరాలు మరింత పరిఢవిల్లుతాయి.
పలకాల్సిన విధంగా అక్షరాన్ని పలకడం వల్ల వాక్ శుద్ధి కలుగుతుంది. కానీ ఏ అక్షరం ఎలా పలకాలో తెలియని జ్యోతిష్య పండితులు బయల్దేరుతున్నారు. వీరు చెప్పే ఫలితాలు అందుకే గతితప్పుతున్నాయి. సంస్కృతాంధ్ర భాషాధ్యయనం చేయని పండితుల ప్రవచనాలు నవ్వుల పాలు అవుతున్నాయి. వారి ఆశీర్వచనాలు అందుకే ఫలించడం లేదు.
ఒక పద్యం చెప్పి శత్రువును చంపగల పాండిత్యం పోయి, పద్యంలో ఒక మంత్రిని ఆశీర్వదిస్తే, పద్యం పూర్తి అయ్యే లోపల వాడి పదవి ఊడిపోతోంది. వీటన్నింటికీ కారణం భాషా పాండిత్యాన్ని గురువుల దగ్గర నేర్చుకోకపోవడమే కాదా అని కొందరు తెలిసిన వారు ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రుల రాజధాని గుంటూరు అవుతున్న వేళ సంస్కృత కళాశాల మూతపడడం శుభం కాదు. సంస్కృత కళాశాలను రక్షించలేని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఉద్ధరిస్తుందనుకోవడం పచ్చిభ్రమ.
ఇప్పటికైనా మేలుకొని గర్తపురీ నగరవాసులారా! మీ సంస్కృత కళాశాలను రక్షించుకోండి.
డాక్టర్ కొలచల వెంకట కృష్ణమూర్తి సంస్కృత కళాశాల మూతపడడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. మీరు రేపు చూద్దాంలే అనుకుంటే, చారిత్రక తప్పిదం చేయబోతున్నారని గుర్తుంచుకోండని కొందరు భాషాభిమానం ఉన్నవారు ప్రాధేయపడుతున్నారు.
ముందుగా గుంటూరువాసులు కొందరు ఈ విషయం పై ఒక మహజర్(petition)ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, స్మృతి ఇరానీకి ఇచ్చి చూస్తే మంచిది.వీలైతే ఒకప్రతినిధి వర్గం లాగ వెళ్ళి రిప్రజెంట్ చెయ్యగలిగితే ఇంకా మంచిది.
మెచ్చుకోండిమెచ్చుకోండి